తిరువనంతపురం : కేరళను నిఫా వైరస్ వణికిస్తుంది. ఈ వైరస్ సోకడం కారణంగా కోజికోడ్ జిల్లాలో విష జ్వరాలు ప్రబలి.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందిని వైద్యాధికారులు అబ్జర్వేషన్లో ఉంచారు. వైరస్ నమూనాలను పుణెలోని ల్యాబ్కు జిల్లా వైద్యాధికారులు పంపారు. విష జ్వరాలపై కలెక్టర్ జోస్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నిఫా వైరస్ వ్యాప్తి చెందడంతో కేరళ ప్రజలను వైద్యశాఖ సిబ్బంది అప్రమత్తం చేసింది. ఈ వైరస్ పందులు, ఇతర జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుందని అధికారులు తెలిపారు. నిఫా వైరస్పై కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా.. నిఫా వైరస్పై వ్యాప్తిపై స్పందించారు. జాతీయ వ్యాధి నియంత్రణ బృందాన్ని కేరళ వెళ్లాల్సిందిగా ఆయన ఆదివారం ఆదేశించారు. నిఫా వైరస్ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జేపీ నడ్డా సూచించారు. ఈ వైరస్ సోకితే తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ఈ వైరస్ను అరికట్టేందుకు ఔషధాలు కూడా లేకపోవడంతో.. ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.