హైదరాబాద్ : ఎంసీఆర్హెచ్ఆర్డీలో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి హాజరయ్యారు. విధి నిర్వహణలో అంకితభావం, ఉత్తమ ప్రతిభ కనబర్చిన 13 మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులతో ఇవాళ సత్కరించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో శాశ్వత రాజకీయ నాయకులు ఎవరూ లేరని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకుంటేనే ఐదేళ్ల పాటు కొనసాగుతారని చెప్పారు. ప్రజల మనుసు గెలిస్తేనే నాయకులు మరోసారి ఎన్నికవుతారని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఫౌండేషన్ కోర్సు ఏమీ ఉండదన్నారు. పరిస్థితులు అర్థం చేసుకోవడానికి ఎవరికైనా సమయం పడుతుందన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సమస్యలపై అవగాహనకు ఏడాది పట్టిందన్నారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకున్నప్పుడే రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నెంబర్వన్గా నిలిచిందని తెలిపారు కేటీఆర్. టీఎస్ఐపాస్ దేశం దృష్టిని ఆకర్షిస్తుంది. అభివృద్ధిలో బ్యూరోక్రసీది కీలకపాత్ర అని కేటీఆర్ పేర్కొన్నారు.