హైదరాబాద్: బాలాపూర్ పరిధిలో ఎల్బీ నగర్ పోలీసులు ఇద్దరు రోహింగ్యాలను అరెస్ట్ చేశారు. రోహింగ్యాలకు సహకరించిన మరో ఇద్దరు నగరవాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ ఆధార్, పాస్పోర్టు, ఓటరు గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ డీసీపీ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ..బాలపూర్ పరిధిలో 3,700 మంది రోహింగ్యాలు శరణార్ధులుగా ఉంటున్నారని చెప్పారు. కొందరు అక్రమంగా పాస్పోర్టు, ఆధార్, ఓటర్ కార్డు పొందేందుకు యత్నించినట్లు వెల్లడించారు. భారత పౌరసత్వం పొందేందుకు రోహింగ్యాలకు అర్హత లేదని, ధ్రువపత్రాల కోసం ప్రయత్నిస్తే రోహింగ్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. రోహింగ్యాలకు సహకరించిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. రొహింగ్యా ప్రజలు, రొహింగ్యా ముస్లింలుగా పిలువబడే వీరు మయన్మార్లోని రఖైన్ రాష్ర్టానికి చెందిన ప్రజలు. వీరికి ఏ దేశపు పౌరసత్వం లేదు.