న్యూఢిల్లీ : కర్ణాటక కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు. హెచ్డీ కుమారస్వామి కలిసి తర్వాతే కలవాలని మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, జి. పరమేశ్వరకు రాహుల్ సూచించారు. ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో రాహుల్తో పాటు సోనియాగాంధీతో కుమారస్వామి సమావేశమై పదవుల పంపకంపై చర్చించనున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రివర్గ కూర్పుపై సోనియా, రాహుల్తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కుమారస్వామి మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆర్థిక, ఆరోగ్య, ప్రజా సంక్షేమ మంత్రిత్వ శాఖలను తన వద్దే ఉంచుకోవాలని కుమారస్వామి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలమో.. హోం, విద్యుత్ శాఖలపై కన్నేసింది. డిప్యూటీ సీఎం పదవిని కూడా కాంగ్రెస్కే ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లింగాయత్ కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉప ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారు. ఇక ఐదు సంవత్సరాలు తానే సీఎంగా ఉంటానని కుమారస్వామి ప్రకటించడంపై కొందరు కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సీఎం పదవిపై గులాం నబీ ఆజాద్ ఇప్పటికే హామీ ఇచ్చారని కుమారస్వామి పేర్కొన్నారు. మొత్తానికి ఇరు పార్టీల మధ్య నెలకొన్న చిన్న చిన్న సమస్యలు.. ఈ సాయంత్రానికి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.