బీహార్ బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ అవధేశ్ నారాయణ్ సింగ్ ఇద్దరు కుమారులపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. తనపై వేధింపులకు పాల్పడిన ఇద్దరిపై ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో ైఫ్లెట్ అటెండెంట్గా పనిచేస్తున్న మహిళ మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నారాయణ్ సింగ్ కుమారులు సుశాంత్ సింగ్ , ప్రశాంత్ సింగ్ పై కేసు నమోదుచేశారు. కాగా ఈ ఘటనపై బంగ్లా వద్ద సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నామని, అక్కడున్న సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నామని ఏఎస్పీ అమర్కేశ్ తెలిపారు. ఈ విషయమై నారాయణ్ సింగ్ మాట్లాడుతూ..సదరు మహిళ తన సొంత పని నిమిత్తం నా అధికారిక నివాసం వద్దకు వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కుమారులతో వాగ్వాదానికి దిగి..ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిందని అన్నారు. తన కుమారులను క్రమశిక్షణతో పెంచానని, ఈ ఘటనపై పోలీసులు పారదర్శకంగా విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని కోరారు.