కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి వీఆర్వో దాసరి కొమురయ్య ఓ రైతు నుండి రూ.20వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన మూల ప్రేంసాగర్రెడ్డి, కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట్ గ్రామానికి చెందిన ఉయ్యాల కొమురయ్య వద్ద 2 ఎకరాల 6గుం టల భూమి కొనుగోలు చేశాడు. భూమి పట్టా కోసం 2016లో సాదాబైనామాతో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ సమయంలో వీఆర్వో కొమురయ్యకు రూ.18వేలు ఇచ్చాడు. పట్టాదారు పాస్పుస్తకాలు ఇవ్వడానికి మరో రూ.20వేలు ఇవ్వాలని వీఆర్వో కొమురయ్య డిమాండ్ చేశాడు. ఇటీవల ప్రభుత్వం ఆమోదించిన రైతుబంధు పథకం కింద రైతు ప్రేంసాగర్రెడ్డికి రూ.8600ల చెక్కు వచ్చింది. నీవు ఒప్పుకున్న రూ.20వేలు ఇస్తేనే నీకు రైతుబంధు చెక్కు, పట్టాదారు పాసుపుస్తకం ఇస్తానని వీఆర్వో కొమురయ్య షరతు విధించాడు. దీంతో రైతు ప్రేంసాగర్రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం వల పన్నిన ఏసీబీ అధికారులు సోమవారం రైతు మూల ప్రేంసాగర్రెడ్డి వీఆర్వోకు రూ.20వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ కిర ణ్కుమార్, సీఐలు వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, సంజీవ్, సిబ్బంది పాల్గొన్నారు.