ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమిత్ షా, రాజ్‌నాథ్‌తో రమణదీక్షితులు భేటీ!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 22, 2018, 09:38 AM

అర్చకులకు 65 ఏళ్ల నిబంధనను తిరుమల తిరుపతి దేవస్థానం అమల్లోకి తీసుకురావడంతో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడి పదవి నుంచి రమణదీక్షితులు తప్పుకోవాల్సి వచ్చింది. టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రమణదీక్షితులు మీడియా ముందుకొచ్చి సంచల ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చేసిన ఆరోపణలను టీటీడీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే రమణదీక్షితుల ఆరోపణల వెనుక బీజేపీ హస్తం ఉందని అధికార టీడీపీ ఆరోపిస్తోంది. వీటికి బలం చేకూర్చేలా బీజేపీ ముఖ్య నేతలతో రమణదీక్షితులు భేటీ అయినట్టు సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఇటీవల భేటీ అయినట్టు కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. 


ఇటీవల చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌లో వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తోన్న రమణదీక్షితులు టీటీడీపై విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. గత శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, అదేరోజు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌లను కలిసినట్టుగా కొన్ని ఫోటోలు సోమవారం సాయంత్రం నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. వీటిపై ‘బీజేపీ, వైసీపీల బంధువర్యుడు రమణదీక్షితులు’ అంటూ కొందరు కామెంట్స్ కూడా రాశారు. దీక్షితుల ఆస్తుల చిట్టా, భవనాలు, ఆడి కారు, వాహనానికి ఆర్‌టీఏ జారీ చేసిన రిజిస్ట్రేషన్‌ పత్రంతో కూడిన ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వచ్చాయి. 


మరోవైపు శ్రీవారి పోటు మరమ్మతులపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని రమణ దీక్షితులు సోమవారం జారీ చేసిన ఓ ప్రకటనలో పునరుద్ఘాటించారు. సీబీఐ విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని, వాటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అలాగే మైసూరు మహారాజా ఇచ్చిందిగా చెబుతోన్న గులాబీ రంగు వజ్రం విషయంలో తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com