భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవాపై ఓ పోలీసు కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడు. తన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టినందుకుగాను కానిస్టేబుల్.. రీవా జుట్టు పట్టుకుని తోసేసినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే... జామ్నగర్లోని సరు సెక్షన్ రోడ్లో రీవా కారులో వెళ్తోంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ ఆమె కారు ముందు ఉన్న ఓ పోలీసుకానిస్టేబుల్ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.
వెంటనే ఆగ్రహంతో ఆ పోలీసు కానిస్టేబుల్ రీవాను దుర్భాషలాడాడు. ఆ తర్వాత ఆమెపై చేయి కూడా చేసుకున్నాడని, జుట్టు పట్టుకుని లాగాడని స్థానికులు చెబుతున్నారు. వారంతా కలగజేసుకోవడంతోనే ఆ కానిస్టేబుల్ రీవాను వదిలేశాడు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి రీవాను అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం స్థానికుల ఫిర్యాదు మేరకు ఆ కానిస్టేబుల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం జడేజా ఐపీఎల్లో ఆడుతున్నాడు. చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తోన్న జడేజా ఈ రోజు తొలి క్వాలిఫయర్ ఆడనున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్కింగ్స్ మధ్య ముంబయిలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.