హైదరాబాద్ : అన్నదాత జీవిత బీమా పథకంపై ఎల్ఐసి అధికారులు చేతులెత్తేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘంతో పాటు వ్యవసాయ, అనుబంధ రంగాల ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులతో ఈ అంశంపై ఆయన సమాలోచనలు జరపనున్నారు. ప్రగతి భవన్ వేదికగా మధ్యాహ్నం ఈ సమావేశం ప్రారంభమవుతుందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి అనుకున్న ప్రకారం పట్టాదారులందరికీ జీవితబీమాను అమలు చేస్తే ఆర్థికపరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. 58 ఏళ్ళు దాటిన వృద్ధులు మరణించిన కొద్దీ ఒక్కో రైతుకు రూ.5 లక్షల చొప్పున చెల్లించడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ అంశంపై కూడా సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చర్చించనున్నారు