హైదరాబాద్: రైతులను ఆదుకోవడం కోసమే రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హెచ్ఐసీసీలో జరుగుతున్న రైతుబంధు జీవిత బీమా పథకం అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో 57 లక్షల మంది రైతులు ఉన్నారన్నారు. రైతుబంధుతో 89 శాతం రైతులు ఆనందంగా ఉన్నాయని పత్రికలు రాశాయని పేర్కొన్నారు. మంత్రి పోచారం లక్ష్మీపుత్రుడు అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. పోచారం మంత్రి పదవిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రైతులకు మంచి కార్యక్రమాలు అమలు అవుతున్నాయన్నారు. తెలంగాణ రైతుల తరపున ఎల్ఐసీకి కృజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ అన్నారు. రైతు బీమా పథకం తన జీవితంలోనే గొప్ప పని అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకం అమలులోకి వస్తుందన్నారు. 18 నుంచి 60 ఏళ్ల రైతులు ఏ కారణంగా చనిపోయినా బీమా వర్తిస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు పది రోజుల్లో రూ.5లక్షల పరిహారం అందుతుందన్నారు.