హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరిన్ని ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అగ్నిమాపక కేంద్రాలు లేని చోట వాటిని ఏర్పాటు చేస్తున్నామని హోం మంత్రి నాయిని తెలిపారు. మరికొన్ని చోట్ల ఫైర్ ఔట్ పోస్టులను ఫైర్ స్టేషన్లుగా అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. గజ్వేల్కు కొత్త ఫైర్ స్టేషన్ మంజూరు చేశామని, త్వరలోనే ఈ ఫైర్ స్టేషన్ను ప్రారంభిస్తామన్నారు. అటు అగ్ని ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని నివారించడానికి 121 ఫైర్ మోటారు సైకిళ్లను ప్రారంభించామని తెలిపారు. ఇవి ఇరుకురోడ్లను, ట్రాఫిక్ రద్దీని సైతం తట్టుకొని వేగంగా అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుంటాయని వివరించారు. ఒక్కో మోటారు సైకిల్ రూ.6 లక్షల 42 వేలు ఉంటుందని పేర్కొన్నారు.