న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ నాలుగో పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పంట పెట్టుబడి సాయం, రైతు సంక్షేమానికి తెలంగాణ చేపట్టిన పలు కీలక అంశాలను సీఎం కేసీఆర్ సమావేశంలో వివరించే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ సమావేశానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు. రైతుల ఆదాయంతో పాటు 7 అంశాలు ప్రధాన ఎజెండాగా భేటీ జరుగుతోంది. వ్యవసాయంరంగ అభివృద్ధి, రైతుల ఆదాయం రెట్టింపునకు దోహదంపై , ఈ-నామ్, వ్యవసాయ, మార్కెటింగ్ సంస్కరణలపై సమావేశంలో చర్చించనున్నారు. గాంధీ 150వ జయంతి వేడుకలకు సంబంధించిన సలహాలు, సూచనలపై కూడా చర్చించనున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు అజెండాలోని అంశాలపై పాలకమండలి చర్చించనుంది. సాయంత్రం 4గంటలకు నీతిఆయోగ్ పాలకమండలి సమావేశం ముగియనుంది.