న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశానికి ఆహ్వానించినందుకు ప్రధాని నరేంద్రమోదీకి ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేసీఆర్ కీలక ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణలో వ్యవసాయరంగ సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను సీఎం కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణలో 98శాతం మంది సన్న, చిన్నకారు రైతులున్నారు. అన్నదాతలను ఆదుకునేందుకు రైతుబంధు పేరుతో ఎకరాకు రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నాం. రైతు బంధు పథకం రుణ లభ్యత, వ్యవసాయోత్పత్తుల ధరలు, పంటల సాగుపై ఎలాంటి ప్రభావం చూపదు. రైతు బీమా యోజన ద్వారా 18 నుంచి 60ఏళ్ల లోపు రైతులకు రూ.5లక్షల బీమా కల్పించామని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు. రైతు బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించనుందని తెలిపారు. బీమా ప్రీమియంతో ఖజానాపై ఏటా రూ.వెయ్యి కోట్ల మేర భారం పడుతుందని వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి 50లక్షల మంది రైతులకు బీమా కల్పించబోతున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పూర్తిచేశామన్నారు. 17రకాల సెక్యూరిటీ ఫీచర్లతో 50లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేసినట్లు వెల్లడించారు. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా గ్రామీణ ప్రాంత భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకత వచ్చిందని ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ నాలుగో పాలకమండలి సమావేశంలో కేంద్రమంత్రులు, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.