భార్యతో గొడవపడిన ఓ యువకుడు క్షణికావేశంలో బిల్డింగ్ మీది నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న ఘటన బోడుప్పల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్కు చెందిన లక్ష్మణ్ (26) ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన రఘు అతడికి మంచి మిత్రుడు.
శనివారం రఘు బర్త్ డే సందర్భంగా ఫ్రెండ్స్తో కలిసి లక్ష్మణ్ వాళ్లింటికి వచ్చాడు. రాత్రి వేళ అక్కడే కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. తర్వాత భోజనాలు చేసే సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఫ్రెండ్స్ ఉన్నప్పుడే భార్య తనతో వాగ్వాదానికి దిగడంతో లక్ష్మణ్ ఫీలయ్యాడు. తెల్లవారు జామున 4 గంటల సమయంలో మూడంతస్తుల బిల్డింగ్ ఎక్కి దూకేశాడు.
లక్ష్మణ్ కింద పడిపోవడం గమనించిన కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు. ప్రథమ చికిత్స అందిచేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే అతడు తుది శ్వాస విడిచాడు. లక్ష్మణ్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.