జపాన్ లోని ఒసాకా సిటీ భూకంపానికి వణికిపోయింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఈ ఎర్త్ క్వేక్ ధాటికి మెట్రోపాలిటన్ సిటీ ఒసాకి షేకైంది. మాల్స్, ఇల్లు, మెట్రో స్టేషన్లు.. ఫ్లై ఓవర్లు అన్నీ కదిలిపోయాయి. భూకంపం ధాటికి వందలాది కట్టడాలు కూలిపోయాయి. ఇప్పటిదాకా ముగ్గురు చనిపోయారని.. 200 మందికి పైగా గాయపడ్డారని జపాన్ మెటిరోలజికల్ ఏజెన్సీ తెలిపింది. ఒసాకా-క్యోటో మధ్యలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప ప్రభావం జపాన్ రాజధాని టోక్యో పైనా ఉంటుందని అంచనా వేశారు. అయితే టోక్యో సేఫ్ గా బయటపడింది. జపాన్ ప్రధాని షింజో అబే భూకంపంపై స్పందించారు. కలిసికట్టుగా పనిచేద్దాం. జనం ప్రాణాలను రక్షించుకోవడం మన ప్రథమ కర్తవ్యం. అంతా కలిసి ఒసాకాను మళ్లీ నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. ఎర్త్ క్వేక్ ధాటికి షింకాన్ సేన్ బుల్లెట్ ట్రైన్ సిస్టమ్ ఆగిపోయింది. ట్రాకుల మీద ఎక్కడికక్కడ బుల్లెట్ ట్రైన్లను నిలిపేశారు. భూకంప తీవ్రతతో ఒసాకా వణికినా.. సునామీ ప్రభావం లేదన్న వార్తలతో జపాన్ ఊపిరిపీల్చుకుంది.