కాంగ్రెస్ పార్టీతోనే రైతు రాజ్యం సాధ్యమవుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం చిలుకూరు, నాగవరప్పాడు, మాటూరుపేటలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో భట్టి విక్రమార్క ప్రసంగించారు. రైతులు పండించిన పంటలకు ఎక్కడా మద్దతు ధరలు లేవని, రైతాంగం పూర్తిగా కుంగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం కుంటుపడిందని, ఈ నాలుగేళ్లలో రాష్ట్రం నాశనమైందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పంటలకూ మద్దతు ధర ఇవ్వడంతో పాటు అర్హత ఉన్న వారందరికీ పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా.. మధిర మండలం దెందుకూరు గ్రామం నుంచి పలు పార్టీలకు చెందిన 30 మంది కాంగ్రె్సలో చేరారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్, సీపీఎం నుంచి వచ్చిన వారికి భట్టి విక్రమార్క కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.