హైదరాబాద్ : పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పసుపు పంటపై బేగంపేటలో భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో స్పైస్ బోర్డు ఆఫ్ ఇండియా నిర్వహించిన ప్రత్యేక వర్క్షాప్లో ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడారు. పసుపు రైతులను ఆదుకునేందుకు ఈ వర్క్షాప్ జరుగుతుందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని 3 దశాబ్దాల నుంచి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. 1990లో 7 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి అయ్యేది. ఇప్పుడు 3 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గిపోయింది. ఈ కారణాలపై వర్క్షాప్లో చర్చిస్తారు.. పరిష్కారం చూపుతారని కవిత పేర్కొన్నారు. సోనాలిక పసుపు వంగడంకు బాగా డిమాండ్ ఉందన్నారు. తెలంగాణలో ఇతర పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. నిజామాబాద్లో స్పైస్ బోర్డును ఏర్పాటు చేయాలని ఎంపీ కవిత డిమాండ్ చేశారు.