రాంచీ: ఆస్ట్రేలియా అసాధారణంగా పోరాడింది. విజయం ఖాయమనుకున్న టీమిండియా ఆశలపై నీళ్లు చల్లింది. చివరిరోజు స్పిన్కు అనుకూలించే పిచ్పై ఆసీస్ బ్యాట్స్మెన్ పీటర్ హ్యాండ్స్కాంబ్, షాన్ మార్ష్ తెగువ చూపించారు. 62 ఓవర్ల పాటు ఊపుమీదున్న భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఒక దశలో 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమివైపు చూస్తున్న ఆసీస్ను ఈ ఇద్దరూ ఆదుకున్నారు. ఐదో వికెట్కు 124 రన్స్ జోడించారు. మార్ష్ 53 రన్స్ చేసి జడేజా బౌలింగ్లో ఔటైనా.. అప్పటికే చేయాల్సిన నష్టమంతా చేసేశాడు. రెండు సెషన్ల పాటు ఈ ఇద్దరూ వికెట్ ఇవ్వకుండా భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. టెస్టుల్లో నంబర్ వన్ జోడీ అశ్విన్, జడేజాలు కూడా ఈ జోడీని విడదీయడానికి కిందామీదా పడ్డారు. ఆట ముగిసే సమయానికి ఆసీస్ 6 వికెట్లకు 204 రన్స్ చేసింది. హ్యాండ్స్ కాంబ్ 72 రన్స్ తో అజేయంగా నిలిచాడు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో ఇప్పటికీ సమంగానే ఉంది. 2010 తర్వాత భారత గడ్డపై తొలి ఇన్నింగ్స్ లో వెనుకబడి చివరికి మ్యాచ్ డ్రా చేసుకున్న విదేశీ జట్టు ఆస్ట్రేలియానే.