హైదరాబాద్ : భాగ్యనగరంలో మరో నెల రోజుల్లో బోనాల ఉత్సవాల సందడి మొదలు కానుంది. జులై 15వ తేదీ నుంచి జంటనగరాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బోనాల ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఏర్పాట్లపై చర్చించిన మంత్రులు.. అమ్మవారికి సమర్పించే బంగారు బోనం నమూనాను విడుదల చేశారు.
జులై 15 నుంచి బోనాల సందడి మొదలు కానుందని మంత్రి తలసాని తెలిపారు. జులై 29న మహంకాళి అమ్మవారి బోనాలు, 30న రంగం జరగనుంది. రూ. కోటి వ్యయంతో 3.80 కిలోల బంగారంతో అమ్మవారికి బోనం తయారు చేయిస్తామని మంత్రి వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా జంటనగరాల్లోని 145 ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.