సూర్యాపేట : గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. యండ్లపల్లి గ్రామంలో రూ. 15 లక్షలతో చేపట్టబోయే అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ. 20 లక్షల అంచనా వ్యయంతో ఎన్ఆర్ఐ నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రూ. 208.50 లక్షలతో మూసీ ఆధునీకరణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యండ్లపల్లి అభివృద్ధి, సంక్షేమానికి ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది రూ. 16 కోట్లు అని తెలిపారు. ఒక్క పింఛన్ల పేరు మీదనే ఈ గ్రామానికి నెలకు రూ. 7 లక్షల చొప్పున ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది రూ. 2 కోట్ల 52 లక్షలు అని మంత్రి వెల్లడించారు.