హైదరాబాద్: హరిత తెలంగాణ లక్ష్యంగా నాల్గో విడత ప్రభుత్వం చేపడుతున్న హరితహారం ఈసారి విద్యాసంస్థల్లో భారీ ఎత్తున చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, బీసీ సంక్షేమ శాఖ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న నిర్ణయించారు. స్వచ్ఛ పాఠశాల-హరిత పాఠశాల నినాదంతో మొదటి తరగతి నుంచి యూనివర్శిటీ వరకు గల విద్యా సంస్థల్లో హరితహారం నిర్వహించాలని, విద్యాశాఖ, అటవీశాఖ, పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో ఈ పనిచేయాలని సూచించారు. విద్యా సంస్థల్లో హరితహారం అమలుపై మంత్రులు కడియం శ్రీహరి, జోగురామన్న సంబంధిత అధికారులతో సచివాలయంలో నేడు సమీక్ష చేశారు. విద్యా సంస్థల్లో నాల్గో విడత హరితహారాన్ని విజయవంతం చేసేందుకు విద్యాశాఖ పరంగా పూర్తి సహకారం ఉంటుందని కడియం శ్రీహరి హమీ ఇచ్చారు. స్వచ్ఛ పాఠశాల-హరిత పాఠశాల పేరుతో గత ఏడాది నుంచి హరితహారాన్ని పాఠశాలల్లో నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా అదే పేరుతో హరితహారం నిర్వహిద్దామని చెప్పారు. ఒకటో తరగతి నుంచి యూనివర్శిటీ వరకు గల విద్యాలయాల్లో ఖాళీ స్థలాలను గుర్తించి బ్లాక్ ప్లాంటేషన్ చేయాలన్నారు.