సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ టిఆర్ఎస్లో చేరిక సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చూపు ఎపి వైపు శాసనమండలిలో ప్రాతినిధ్యం కోసం తహతహ చట్ట సభలలో వాణిని వినిపించలేకపోతున్న కమ్యూనిస్టులు రెండు రాష్ట్రాలలోను ఉనికి కోసం పాకులాట ప్రజా సమస్యలపై పోరుబాట పట్టిన ఎరజ్రెండాలు తోక పార్టీలుగా ముద్ర వేసుకుంటున్న వామపక్షాలు
మేజర్న్యూస్ తెలంగాణ ప్రతినిధిః ఒకపుడు రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించిన వామపక్ష పార్టీలు రోజు రోజుకు ఉనికికోసం పాకులాడు తున్నాయి. ప్రజా సమస్యలపై పోరు సాగించే సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగయిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఓ వైపు పార్టీ నిర్మాణంపై అగ్రనేతలు దృష్టి సారించకపోగా మరో వైపు ఉన్న క్యాడర్ కూడ చెల్లాచెదురవుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు రెండు రాష్ట్రాలలోను ఎర్రజెండా పార్టీలు నిర్మాణ పరంగా బలంగానే ఉండేవి.2004 సార్వత్రిక ఎన్నికలలో అప్పటి అసెంబ్లీలో రెండు పార్టీలకు కలపి 16 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. కానీ ఆ తదనంతర పరిణామాలలో కొద్ది రోజులకే వామపక్ష పార్టీలకు ఎదురుదెబ్బలు తగిలాయి. 2009 ఎన్నికల నాటికి సిపిఎం పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండగా సిపిఐకి నలుగురు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో రెండు పార్టీలు భిన్న వైఖరులు తీసుకున్నాయి. సిపిఐ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉద్యమాలు చేపట్టగా సిపిఎం మాత్రం సమైక్యాంద్రప్రదేశ్కు కట్టుబడి ఉంది. ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నప్పటికి రెండు పార్టీలకు ఆయా శాసన సభలలో ప్రాతినిథ్యం కరువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సిపిఎం, సిపిఐ పార్టీలకు ప్రాతినిధ్యం లభించలేదు. ఒక్క స్థానంలో కూడ పార్టీ అభ్యర్థులు విజయం సాదించలేకపోయారు. కాస్తో, కూస్తో రెండు పార్టీలకు తెలంగాణలోనే కొంత బలముండేది. గడిచిన ఎన్నికలలో కాంగ్రెస్తో జట్టు కట్టిన సిపిఐ కేవలం దేవరకొండ అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన చోట్ల దారుణంగా ఓడిపోయింది. ఒంటరిగా పోటీచేసిన సిపిఎం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం స్థానంలో గెలుపొందింది. నిన్న మొన్నటి వరకు తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీలకు ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చారు.
గులాబీ గూటికి చేరుకున్న రవీంద్రనాయక్
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ ఇటీవలే సిఎం కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. నియోజక వర్గంలోని తన అనుచరులతో కలసి ఆయన గులాబీ గూటికి చేరుకున్నారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీచేసినప్పటికి ఓటర్ల తిరస్కరణకు గురయింది. ఇక మండలిలోను ప్రాతినిథ్యం లే దు. రాష్ట్ర విభజన తదనంతర పరిణామాలలో సిపిఐ నేతలు ప్రజా ఉద్యమాలకు దూరంగా ఉన్నారు. గతంలో ఇళ్ల స్థలాలు, పెరిగిన విద్యుత్, బస్సు ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేవారు. కానీ ఇపుడు పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగిన నారాయణ ప్రత్యేక తెలంగాణ కోసం చివరి వరకు ఉద్యమం చేశారు. అయినప్పటికి పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. బూర్జువా పార్టీలకు చెందిన నాయకులు పార్టీ మారతారని కమ్యూనిస్టులు ఎపుడు పార్టీ మార్పుకు దూరంగా ఉంటారన్న ప్రచారానికి రవీంద్ర నాయక్ తెరదించారు.
చెల్లాచెదురైన భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం
ఖమ్మం జిల్లాలోని భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం చెల్లా చెదురైంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆ నియోజకవర్గం లోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకువచ్చింది. దీంతో కేవలం భద్రాచలం పట్టణం మాత్రమే తెలంగాణలో ఉండగా మిగితా మండలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో కలి శాయి. ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మరో సారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆలోచిస్తున్న అక్కడి ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఎక్కువగా ఎపికి కెటాయించిన మండలాలలోను పర్యటిస్తు అక్కడి ప్రభుత్వంతో సన్నిహిత సంబందాలు నెరుపుతున్నారు. తెలంగాణ అసెంబ్లీకి హజరవుతున్నప్పటికి పార్టీ వాయిస్ను వినిపించడంలో విఫలమవుతున్నారు. ఇక ప్రజా సమస్యలపై పోరుబాట పట్టే సిపిఎం నేతలు పైరవీలకు పరిమితమయ్యారన్న అపవాదులు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ కాస్తో, కూస్తో బలంగా ఉండే ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాలో కూడ ఉనికి కోల్పోయింది. ఈ మద్య జరిగిన పాలేరు ఉప ఎన్నికలలో డిపాజిట్ కోల్పోవడం పార్టీకి పెద్ద మైనస్గా మారిందని చెప్పవచ్చు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీలను సంస్థాగతంగా నిర్మిస్తూ పోరుబాట పట్టాల్సిన నాయకులు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పై నిర్వాసితులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికి ప్రజల నుండి ఏ మేరకు మద్దతు లబిస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు కమ్యూనిస్టలు తోకపార్టీలుగా మిగిలే అవకాశాలు కనిపిస్తుండడంతో దీనిని అరికట్టేందుకు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది.