రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నేటి నుంచే నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డీఈవోలకు ఉత్తర్వులు వెళ్లాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం నేటి నుంచి ఏప్రిల్ 23 వరకు ఒకనెల వరకు తరగతులు నిర్వహించి ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానున్న వేసవి సెలవులలో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇక ఏప్రిల్ 17 నుంచి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలంగాణ ఓపెన్ స్కూల్ ప్రకటించింది. ఏప్రిల్ 14 నుంచి మే 5 వరకు ఇంటర్మీడియట్, ఏప్రిల్ 17 నుంచి మే 3 వరకు ఎస్సెస్సీ పరీక్షలను నిర్వహించనున్నారు.