మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో ముంబై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంబైలో ఇద్దరు, థానేలో మరొకరు మృతి చెందారు. లోతట్టు ప్రాంతాల్లోని నీటిని బయటకు పంపేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని రైళ్లు రద్దు అయ్యాయి. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
అన్టాప్ హిల్ ప్రాంతంలో ప్రహరీ గోడ కుప్పకూలింది. గోడ కూలడంతో 15 కార్లు శిథిలాల్లో కూరుకుపోయాయి. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తుంది. ఈ భవనంలో సీనియర్ లాయర్లు, పేరున్న వ్యాపారుల నివాసాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీలైనంత త్వరగా భవనాన్ని ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. ముంబైలో గడిచిన 24 గంటల్లో 231.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని ముంబై ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.