ఒకనాటి రాళ్లు.. చెట్లతో కూడిన అరణ్య ప్రాంతమది.. పాలకుల నిర్ణయంతో ఆ కొండంతా దేవుడిపరమైంది. చినజీయర్స్వామిజీ నామకరణం చేయడంతో యాదాద్రి పెద్దగుట్టగా మారింది. ‘యాడా’ ప్రణాళికలతో ఆలయ నగరిగా రూపుదిద్దుకోనుంది. తొలుత 202 కాటేజీల నిర్మాణం కోసం 250 ఎకరాల్లో లేఅవుట్ పనుల్లో రహదారులు, ఇరువైపులా పచ్చదనం పోషణ చేపట్టారు. కాటేజీల నిర్మాణానికి హంగులన్నీ సిద్ధమయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (యాడా) వైస్ఛైర్మన్ జి.కిషన్రావు ‘న్యూస్టుడే’కు తెలిపారు.
శరవేగంగా విస్తరణ పనులు: క్షేత్రాభివృద్ధిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ, ఆలయ నగరి అత్యంత ప్రాధాన్యం గల ప్రాజెక్టులు. శిల్పకళా సంపదతో ఆలయ విస్తరణ పనులు శరవేగిరమయ్యాయి. వచ్చే దసరాలోగా ఆపనులను పూర్తిచేయాలన్నది ‘యాడా’ నిర్ణయం. భక్తజనుల బసకు తగ్గ వసతుల కల్పనకు ఆలయ నగరి నిర్మాణానికి ప్రణాళిక రూపొందింది. పెద్దగుట్టపై అన్ని వసతులతో ఆధ్యాత్మిక ఆహ్లాదం అందించే తరహాలో ఆలయనగరిని నవ్యగిరిగా రూపొందబోతోంది.
విదేశీ, స్వదేశీ యాత్రికులకు తగ్గ కాటేజీల ఏర్పాటుకు యోచిస్తున్నారు. అందుకే కాటేజీల డిజైన్ల తయారీపై ‘యాడా’ ప్రత్యేక దృష్టి పెట్టింది. దాతల ద్వారానే వాటిని నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశ్రామికవేత్తలు, బిల్డర్లతో సమావేశం కానున్నారు.
850 ఎకరాలున్న పెద్దగుట్టపై తొలుత 250 ఎకరాలలో లేఅవుట్ పనుల్లో రహదారులు, పచ్చదనం, నీటిసరఫరా, మురికికాల్వల నిర్మాణం, విద్యుత్తోసహా భూగర్భంలో కేబుల్ ఏర్పాట్లకు రూ.207 కోట్ల ఖర్చుకాగలదని అంచనా.
చేట్టిన లేఅవుట్ పనుల్లో ఇప్పటి వరకు 14 కి.మీ పొడవు రహదారులు, ఇరువైపులా హరితహారం పోషణ, మురుగు నీటి కాల్వలు, కేబుల్ పైపులు, డివైడర్లు ఏర్పాటయ్యాయి.
ఎత్తైన కొండపై తిరుమల తరహాలో కాటేజీల నిర్మాణం జరగనుంది. తొలుత 202 కాటేజీల నిర్మాణానికి దాతలను ఆహ్వానిస్తున్నారు. సీఎం ఆదేశాలు వచ్చాక దాతలకు 600, 1000 చదరపు గజాల (స్థలాలు) ప్లాట్లను కేటాయించనున్నారు. పెద్దగుట్టపై నిర్మితమయ్యే ఆలయనగరి కోసం 38 విశాల రహదారులు, వాటికి ఇరువైపులా ఆకర్షణీయ మొక్కలను పెంచారు. ఆ గుట్టపై నుంచి పాతగుట్ట ఆలయానికి దారి నిర్మాణం జరుగుతోంది.