ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉప్పొంగుతున్న గోదావరి, ప్రాణహిత నదులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 09, 2018, 01:14 PM

తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. నైరుతి రుతు పవనాలకు తోడు.. ఉపరితల ఆవర్తనతో రెండు మూడు రోజులుగా కురిసిన జోరు వానలతో రాష్ట్రం తడిసిముద్దయ్యింది. ఇల్లెందులో అత్యధికంగా 8.5, ఎన్కూరులో 7.. వెంకటాపూర్, ఖమ్మం అర్బన్‌లో 6.. జూలూరు పాడు, చింతకాని, ఎల్లారెడ్డి, బయ్యారం, డోర్నకల్, అశ్వారావు పేట, మణుగూరుతో పాటు కొన్ని ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షం పడింది. ఆదివారం కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసాయి. ఈ వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల దెబ్బకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 


వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు, జలపాతాలకు కళ వచ్చింది. నిర్మల్‌ జిల్లాలో కడెం జలాశయానికి పూర్తిస్థాయి నీటిమట్టం కనిపిస్తోంది. ఎగువ నుంచి కూడా వరద వస్తోంది. దీంతో అధికారులు ఒక గేటును ఎత్తి నీటిని కిందకు వదిలేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చీకుపల్లి వాగుపై ఉన్న బొగత జలపాతం కూడా జలకళను సంతరించుకుంది. తెలంగాణతో పాటూ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు గోదావరి, ప్రాణహిత నదులు పొంగుతున్నాయి. వీటితో పాటూ జిల్లాల్లో ఉన్న చెరువులు కూడా నిండి కొన్నిచోట్ల అలుగు పారుతోంది. 


మరోవైపు ఒడిశా సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో.. మరో రెండు మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. వర్షాలతో ఇటు రైతులు కూడా వ్యవసాయ పనుల్ని ముమ్మరం చేశారు. 


భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాతో తెలంగాణ ప్రభుత్వం అలర్టయ్యింది. అన్ని జిల్లాల అధికారుల్ని అప్రమత్తం చేసింది. ఇవాళ జరగాల్సిన కేబినెట్ భేటీని కూడా వాయిదా వేసిన సీఎం కేసీఆర్. మంత్రులంతా జిల్లాల్లోనే ఉండాలని ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com