చెన్నై : తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ సతీమణి లతకు సుప్రీంకోర్టులో మంగళవారం చుక్కెదురైంది. మోసం చేసిన కేసులో పోలీసు విచారణను ఎదుర్కోవాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. 2014లో కొచ్చాడయాన్ (తెలుగులో విక్రమసింహ) చిత్ర నిర్మాణం కోసం ఆ చిత్ర నిర్మాణ సంస్థ మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరైన లత హామీమేరకు బెంగళూరుకు చెందిన యాడ్ బ్యూరో సంస్థ రూ.10 కోట్లు అప్పు ఇచ్చింది.అప్పులో రూ.8.70 కోట్లను తిరిగి చెల్లించారు. వడ్డీసహా ఇంకా రూ.6.20 కోట్లను చెల్లించకపోవడంతో ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బకాయి మొత్తాన్ని 12 వారాల్లోగా చెల్లించాలని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు లతను ఆదేశించింది. ఎందుకు చెల్లించలేదని, ఎప్పుడు చెల్లిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే, దీనికి ఆమె స్పందించలేదు. దీంతో లత కేసు విచారణను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.