రాయ్పూర్ : ముగ్గురు అమ్మాయిల శీలానికి పంచాయితీ వెల కట్టిన దారుణ ఘటన చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని జాష్పూర్ జిల్లా మారుమూల గ్రామంలో వెలుగుచూసింది. ఈ నెల 5వతేదీన ముగ్గురు అమ్మాయిలు పనిపై బయటకు వెళ్లి సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. తర్వాత వారి కోసం గాలించగా ముగ్గురు కామాంధులు ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం చేసి పారిపోయారని తేలింది. బాలికల తండ్రి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం కాగా గ్రామపంచాయితీ పెద్దలు ఆయన్ను వారించి రాజీ పడేలా పంచాయితీ చేస్తానని సర్పంచ్ చెప్పారు. రేపిస్టులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున రూ.30 వేల జరిమానా విధిస్తూ పంచాయితీ తీర్పు చెప్పింది. రేపిస్టుల నుంచి వసూలు చేసిన డబ్బుతో గ్రామస్థులు మటన్తో విందు జరుపుకున్నారు. జరిమానా డబ్బుల్లో విందు చేసుకోగా డబ్బులు మిగలడంతో గిరిజన గ్రామంలో ఉన్న 45 మంది ఒక్కొక్కరు రూ.485 చొప్పున పంచుకున్నారు. తన కూతుళ్ల శీలానికి పంచాయితీ వెల కట్టి ఆ జరిమానా డబ్బుతో విందు చేసుకున్నారని బాధితురాళ్ల తండ్రి ఆవేదనగా చెప్పారు. క్షమాపణలు చెప్పడంతో నిందితుల నుంచి జరిమానా వసూలు చేశామని సర్పంచ్ నారాయణ్ భగత్ సమర్ధించుకున్నారు. అత్యాచారంపై పంచాయితీ తీర్పు వ్యవహారం జర్నలిస్టుల ద్వార పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో దర్యాప్తు చేసేందుకు తమ పోలీసు బృందాన్ని గ్రామానికి పంపించామని జాష్పూర్ ఏఎస్పీ ఉనేజా ఖాతూన్ అన్సారీ చెప్పారు.