బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తొలి గ్రాండ్ స్లామ్ను అందుకునే దిశగా మళ్లీ ఫామ్ లో కనిపిస్తోంది సెరెనా. వింబుల్డన్ మహిళల సింగిల్స్లో 11వసారి వింబుల్డన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం క్వార్టర్స్లో ఇటలీ అమ్మాయి జియార్జి ఆమెకు సవాలు విసిరినా.. తట్టుకుని, పుంజుకున్న సెరెనా.. గంటా 43 నిమిషాల పాటు సాగిన మూడు సెట్ల పోరులో నెగ్గింది. 36 ఏళ్ల సెరెనా 3-6, 6-3, 6-4తో జియార్జిని ఓడించింది.గంటా 43 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో.. సెరెనా ఏడు, జార్జీ 6 ఏస్లను సంధించారు. అయితే ఆరుసార్లు డబుల్ ఫాల్ట్లు చేసిన ఇటాలియన్ మూల్యం చెల్లించుకుంది. మరో క్వార్టర్స్ మ్యాచ్లో 11వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-3, 7-5తో కసాట్కినా (రష్యా)పై గెలిచింది. ఇతర మ్యాచ్ల్లో ఒస్టాపెంకో (లాత్వియా) 7-5, 6-4తో సిబుల్కోవా (స్లొవేకియా)పై, జార్జెస్ (జర్మనీ) 3-6, 7-5, 6-1తో బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై నెగ్గి సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకున్నారు.గ్రాస్కోర్టులో అమెరికన్కు ఇది 100వ విజయం కాగా, ఓవరాల్గా కెరీర్లో ఇది 35వ గ్రాండ్స్లామ్ సెమీఫైనల్. 2013 తర్వాత టాప్-40 ర్యాంక్ లోపు ఉన్న ప్రత్యర్థులను ఎదుర్కోకుండా సెమీస్ చేరిన తొలి క్రీడాకారిణిగా సెరెనా రికార్డులకెక్కింది.నేను ఏ దశలోనూ మ్యాచ్ ఓడిపోతానని ఆందోళన చెందలేదు. తొలి సెట్ కోల్పోయినపుడు కూడా నా ప్రత్యర్థి బాగా ఆడుతోందని అనుకున్నాను. చాలా ఏళ్లుగా పరిస్థితులు ఎలా ఉన్నా పోరాటం కొనసాగించడం నాకు అలవాటుగా మారింది. ఈ మ్యాచ్లోనూ అదే చేశాను. నా కూతురికి కూడా ఈ సూత్రం చెప్పాలని అనుకుంటున్నాను' అని మ్యాచ్ అనంతరం సెరెనా వ్యాఖ్యానించింది. గురువారం జరిగే సెమీఫైనల్లో జర్మనీ ప్లేయర్, 13వ సీడ్ జూలియా జార్జెస్తో సెరెనా తలపడుతుంది.