ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెత్తను విడదీయాల్సింది.. ఇంట్లోనే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 11, 2018, 11:25 AM

చెత్తను తడి, పొడిగా విడదీయాల్సిన బాధ్యత స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరించే వారిదా, లేక ఇంటి యజమానులదా? అనే సందిగ్ధతకు తెరదించుతూ జీహెచ్‌ఎంసీ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. చెత్త సేకరించే వారికి నెలకు రూ. 50 చొప్పున ఫీజు చెల్లిస్తున్నందున ఆ బాధ్యత వారిదేననే వాదన సరికాదని తేల్చేసింది. చెత్తను విడదీయాల్సిన బాధ్యత గృహిణులదేనని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. 


నగరానికి చెందిన ఓ వ్యక్తి తాను చెత్త సేకరించేవారికి ప్రతినెలా రూ. 50 చొప్పున చెల్లిస్తున్నా వారు చెత్తను విడదీయకుండా అలాగే తీసుకొని వెళ్తున్నారని ఇటీవల పురపాలకశాఖ మంత్రి కే.టీ. రామారావుకు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని మంత్రి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కోరారు.


ఈ నేపథ్యంలో చెత్తను ఎవరు వేరుచేయాలనేది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే అధికారులు ప్రకటన విడుదలచేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం, తడి,పొడి చెత్తను విడదీసేందుకు ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఇంటికి రెండు చొప్పున 22లక్షల ఇండ్లకు చెత్త బుట్టలను పంపిణీ చేసింది. అంతేకాకుండా ఇంటింటి చెత్త సేకరణకు దాదాపు 500కు పైగా స్వచ్ఛ ఆటోలను ప్రవేశపెట్టారు. అయినా నగరవాసులు చాలావరకు చెత్తను విడదీయకుండా కలిపే ఉంచుతున్నారు. దీంతో చెత్తను సేకరించేవారు సైతం యథావిథిగా తీసుకొని వెళ్తున్నారు. చెత్తను విడదీయనంతకాలం ఘన వ్యర్థాల నిర్వహణ సాకారం అయ్యే ఆస్కారం లేదు. చెత్తబుట్టలు పంపిణీచేసి రెండేండ్లు గడుస్తున్నా ఇంతవరకు చాలా ప్రాంతాల్లో చెత్తను విడదీస్తున్న దాఖలాలు లేవు.


 


ఈ నేపథ్యంలో చెత్తను విడదీసే విషయంలో బల్దియా స్పష్టతనిచ్చింది. ఇండ్లవద్దే తడి, పొడి చెత్తను విడివిడిగా వేయాలని, ఆ బాధ్యత ఇంటి యజమానులదే నని స్పష్టంచేశారు. స్వచ్ఛ ఆటోలకు ప్రతినెలా రూ. 50 ఫీజు ఇవ్వడంవల్ల వారికి ప్రశ్నించే అధికారం వస్తుందని, అందుకే ఫీజు చెల్లించాల్సిన విధానం పెట్టినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. ఉచిత విధానం ప్రవేశ పెడితే ఇండ్ల యజమానులు, చెత్తను సేకరించేవారు అంత బాధ్యతగా ఉండరని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, చెత్తను విడదీయాల్సిన ఆవశ్యకతపై గృహిణుల్లో చైతన్యం కలిగించేందుకు స్వచ్ఛదూత్‌ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు, అపార్ట్‌మెంట్లు, గృహ సముదాయాల్లో కంపోస్ట్ పిట్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాకుండా, తాజాగా స్వచ్ఛ ఆటోలకు మైకులను ఏర్పాటు చేసి చెత్తను విడివిడిగా వేయాలని, నాలాల్లో వేయొద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్లు వివరించారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com