బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. అంబర్పేటలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్రెడ్డి, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర పండుగ బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం చేశారు. బోనాల ఉత్సవాల కోసం రూ. 50 లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
అంబర్పేట నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ నిధులతో బోనాల ఏర్పాట్లు చేస్తామన్నారు. బోనాల సందర్భంగా రూ. 5.6 లక్షలతో ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. భక్తులకు పంపిణీ చేసేందుకు 50 వేల నీళ్ల పొట్లాలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. పారిశుధ్య నిర్వహణకు అదనంగా 200 మంది సిబ్బందిని తీసుకుంటామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం మహంకాళి ఆలయం వద్ద వేదిక ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు.