రాష్ట్రంలోని ప్రతి ఇంజినీరు తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇంజినీర్స్ డే సందర్భంగా జలసౌధలోని నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహుదూర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులు, అద్భుత కట్టడాల రూపకర్త నవాబ్ అలీ నవాజ్ జంగ్ అని హరీశ్ రావు కొనియాడారు. ఆ రోజుల్లో సాంకేతిక ప్రగతి లేకున్నా.. నవాజ్ జంగ్ అద్బుతంగా నిజాం సాగర్ ప్రాజెక్టును నిర్మించారని కొనియాడారు. ఆ రోజుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా ఇది గుర్తింపు పొందిందని తెలిపారు.
నవాబ్ జంగ్ ప్రాజెక్టులు, కట్టడాలకు రూపకల్పన చేసి, నిర్మించి మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు సమాంతరంగా గొప్ప కీర్తిని గడించారని హరీశ్రావు కొనియాడారు. అదే స్ఫూర్తిని రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ శాఖ ఇంజినీర్లు, మిషన్ కాకతీయ, సాగునీటి శాఖ ఇంజినీర్లు, ఆర్ అండ్ బి ఇంజినీర్లు, పంచాయతీ ఇంనీర్లు, అహర్నిశలు పని చేస్తూ… రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారని చెప్పారు. తమ శాఖలో ఇంజినీర్లు రూపకల్పన చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చూసి సీడబ్ల్యూసీ ఇంజినీర్లు సైతం అబ్బురపడుతున్నారని చెప్పారు. ప్రతీ ప్రాజెక్టులోను మహిళా ఇంజినీర్లు రాత్రింబవళ్లు పని చేస్తూ తమ ఇంజినీరింగ్ ప్రతిభను చాటుతున్నారన్నారు. రాత్రింబవళ్లూ ఇంజినీర్లు చక్కటి నీటి యాజమాన్య పద్ధతిని నిర్వహిస్తున్నారని చెప్పారు. ఒకప్పుడు ఒక టీఎంసీతో ఆరు వేల ఎకరాలకు నీరు ఇవ్వడమే గగనమయ్యేదని… తెలంగాణ ఇంజినీర్లు సమర్థంగా పనిచేస్తూ ఇప్పుడు 10వేల ఎకరాలకు పైగా నీళ్లిస్తున్నారని హరీశ్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇంజనీరింగ్శాఖ అధికారులు పాల్గొన్నారు.