టిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు తిరుపతిలో బుధవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన తిరుపతి కొండకు వెళుతున్నట్లు తెలిపి, విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ను మానసికంగా హింసించి చంపిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు నమ్మకద్రోహి, మోసగాడు, దుర్మార్గుడు, గజదొంగని మండిపడ్డారు. కెసిఆర్ నాకు మంచి స్నేహితుడని తెలిపారు. టిడిపిపై విమర్శలు చేస్తే తనను చంపడానికి చూశారని, రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి తనను చంద్రబాబు నట్టేట ముంచాడని అన్నారు. ఒక్కో రాజ్యసభ సీటును 100 కోట్ల రూపాయలకు చంద్రబాబు అమ్మేశారని తెలిపారు. టిడిపి నుంచి తనను ఎందుకు బహిష్కరించారో చెప్పాలన్నారు. ఆరు సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచి ఎప్పుడూ తాను అవినీతికి పాల్పడలేదని తెలిపారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికారన్నారు. తాను దళితుడిని కాబట్టే పార్టీ నుంచి బహిష్కరించారని చెప్పారు. టిడిపి నేత గాలి ముద్దు క్రిష్ణమనాయుడుకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే మానసిక క్షోభతో చనిపోయాడని చెప్పారు. రేవంత్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.