హైదరాబాద్ : బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండేలా అమ్మవారి అనుగ్రహం ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగ నిర్వహణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇవాళ బొగ్గులకుంటలోని ధార్మిక భవన్ లో బోనాల నిర్వహణ పై దేవాదాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, అదనపు కమిషనర్ శ్రీనివాస రావు, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, నగర సహాయక కమిషనర్లు, వివిధ ఆలయాల కార్య నిర్వహణ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా అంబరాన్ని అంటేలా బోనాల సంబరాలను జరుపుకునేలా అన్నిశాఖల అధికారుల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరంలోని 14 ప్రధాన ఆలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తామన్నారు. బోనాలు జరిగే అన్ని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, రహదారులను శుభ్రంగా ఉండేలా చూడాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. విజయవంతంగా బోనాల ఉత్సవాలను నిర్వహించాలన్నారు. బోనాల పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని భక్తులకు సూచించారు.