న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ స్పేస్ టూరిజాన్ని ప్రారంభించబోతున్నారు. వచ్చే ఏడాది నుంచే దీనిని మొదలుపెట్టే అవకాశం ఉంది. బ్లూ ఆరిజిన్ అనే సంస్థ ఈ స్పేస్ టూరిజం కోసం న్యూ షెపర్డ్ అనే స్పేస్ వెహికిల్ను తయారు చేసింది. ఇప్పటికే ఎన్నో టెస్ట్ డ్రైవ్లు కూడా సంస్థ నిర్వహించింది. బెజోస్ కూడా న్యూ షెపర్డ్లో త్వరలోనే మనుషులను అంతరిక్షంలోకి తీసుకెళ్తామని చెప్పినా.. టికెట్ ధరను మాత్రం వెల్లడించలేదు.
అయితే తాజాగా కంపెనీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ స్పేస్ టూర్ కోసం ఒక్కో వ్యక్తికి 2 లక్షల డాలర్ల (సుమారు రూ.1.36 కోట్లు) నుంచి 3 లక్షల డాలర్లు (రూ.2.05 కోట్లు) వరకు వసూలు చేయనున్నారు. స్పేస్లోకి వెళ్లాలని ప్రపంచవ్యాప్తంగా పలువురు కుబేరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లాంచింగ్ రాకెట్, ప్యాసెంజర్ క్యాప్సూల్లతో కూడిన స్పేస్ వెహికిల్ను కంపెనీ తయారుచేసింది. ఆరుగురు ప్రయాణికులను ఇది అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదు. భూమికి 100 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్యాసెంజర్స్ను తీసుకెళ్లడానికి బ్లూ ఆరిజిన్ ప్లాన్ చేసింది.
రాకెట్ ద్వారా లాంచ్ చేసిన తర్వాత ప్యాసెంజర్ క్యాప్సూల్ అంతరిక్షంలో విడిపోతుంది. ప్రయాణికులు అక్కడి పరిస్థితులను పరిశీలించిన తర్వాత పారాచూట్ల సాయంతో మళ్లీ ఈ క్యాప్సూల్ భూమికి తిరిగొస్తుంది. న్యూ షెపర్డ్ను ఇప్పటికే ఎనిమిది సార్లు అంతరిక్షంలోకి పంపించి.. మళ్లీ సేఫ్గా భూమిపై ల్యాండయ్యేలా పరీక్షించి చూశారు. స్పేస్ టూరిజం రంగంలో జెఫ్ బెజోస్కు రిచర్డ్ బ్రాన్సన్, ఎలోన్ మస్క్లాంటి బిలియనీర్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. బ్రాన్సన్కు చెందిన వర్జిన్ గలాక్టిక్ ఇప్పటికే 650 టికెట్లు అమ్మినట్లు వెల్లడించింది. అయితే ఎప్పుడు ఈ టూర్ మొదలుపెట్టే విషయం చెప్పలేదు. ఈ సంస్థ రెండున్నర లక్షల డాలర్లు వసూలు చేస్తున్నది.