ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు వికారాబాద్ సమీపంలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఆషాఢ మాసం చిన్న జాతర ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవాలయ మేనేజర్ శేఖర్గౌడ్, కార్యదర్శి శాంతకుమార్లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. 27న పౌర్ణమి సందర్భంగా మధ్యాహ్నం ఒంటిగంటకు స్వామి వారి గరుడ వాహన సేవ, పెరుగు వసంతోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు చంద్రగ్రహణం ఉండటం వల్ల సాయంత్రం 4 గంటల వరకు అన్ని కార్యక్రమాలు నిర్వహించి ఆలయం మూసివేయనున్నట్లు వెల్లడించారు. భక్తులు సాయంత్రం నాలుగు వరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. చంద్రగ్రహణం దృష్ట్యా భక్తులు సహకరించాలని కోరారు.
అనంతపద్మనాభ స్వామి ఆషాఢ మాసం చిన్న జాతరను పురస్కరించుకొని ఈనెల 19న కొబ్బరికాయల వేలం పాట నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతపద్మనాభ స్వామి ఆలయంలో ఏడాది పాటు 2018 ఆషాఢ శుద్ధ దశమి నుంచి 2019 శుద్ధ నవమి వరకు కార్తీక మాసం పెద్ద జాతర మినహాయించి కొబ్బరికాయలు అమ్ముకొనే హక్కు కోసం బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వారు రూ.10 వేలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలన్నారు. హక్కు పొందిన వారికి తప్ప మిగిలిన వారికి డిపాజిట్ రూ.10 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.