కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్కి కోల్కతా కోర్టు సమన్లు జారీ చేసింది. ‘హిందూ పాకిస్తాన్’ అంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై కోల్కతాకి చెందిన న్యాయవాది సుమీత్ చౌధురి ఫిర్యాదు చేశారు. ‘‘శశి థరూర్ దేశ ప్రజల మత విశ్వాసాలను గాయపర్చేలా మాట్లాడారు. రాజ్యాంగాన్ని సైతం అవమానించారు. ఆయన వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చుపెట్టి ఘర్షణలు, ఉద్రిక్తతలు సృష్టించేలా ఉన్నాయి...’’ అని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో శశిథరూర్పై ఐపీసీ సెక్షన్ 153ఏ, 295ఏలతో పాటు, దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడాన్ని నిరోధించే చట్టం (1971)లోని సెక్షన్ 2 కింద కేసు నమోదు చేశారు. కాగా వచ్చే నెల 14న శశిథరూర్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
2019 ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే దేశం ‘‘హిందూ పాకిస్తాన్’’గా మారుతుందంటూ... శశిథరూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని సైతం ‘‘కూల్చేసి’’ తమ సొంత చట్టాలను అమల్లోకి తెస్తుందని థరూర్ ఆరోపించారు. దీంతో బీజేపీ నేతలు శశిథరూర్పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.