హైదరాబాద్: ఆషాఢ బోనాలకు గొల్కొండ కోట సిద్ధమైంది. తెలంగాణలో తొలిబోనాల వేడుకను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు పంపిణీ చేసేందుకు వాటర్ప్యాకెట్లను సిద్ధం చేశారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సౌకర్యాలను పరిశీలిస్తున్నారు. ఈ సంబురాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో ఎక్కడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించనున్నారు. లంగర్హౌజ్లో ఏర్పాటు చేసిన తొట్టెలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. చోటాబజార్లోని పూజారి అనంతచారి ఇంటికి తొట్టెల ఊరేగింపు చేరనుంది. పూజారి ఇంట్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. తొట్టెల ఊరేగింపు లంగర్హౌస్ నుంచి గోల్కొండ వరకు కొనసాగనుంది. లంగర్హౌస్, చెరువుకట్ట, ఫతేదర్వాజా, చోటాబజార్ల మీదుగా ఊరేగింపు కోటపైకి చేరుకోనుంది. గోల్కొండ ఆలయానికి వెళ్లే మెట్లను పసుపు, కుంకుమలతో భక్తులు ఇప్పటికే అలంకరించారు. గోల్కొండ కోట, ఆలయం వద్ద పోలీసుశాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది.