రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నిర్మించిన ఐటీఐ కళాశాల భవనాన్ని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. ఐటీఐ కళాశాల ప్రారంభంతో ఇక్కడున్న విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. ఈ కళాశాలలో చదివిన పిల్లలకు భవిష్యత్తులో త్వరగా ఉపాధి దొరికే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాకుండా విపక్షాలు కుట్రలు చేస్తున్నాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా లక్షా 12 వేల ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతాం అని మంత్రి స్పష్టం చేశారు. ప్రయివేటు రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందని తెలిపారు. తెలంగాణకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్న వైనాన్ని కేంద్రం గుర్తించిందని చెప్పారు.