రాజన్న సిరిసిల్ల : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు.. మరో 15 ఏండ్లు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నిర్మించిన ఐటీఐ కళాశాల భవనాన్ని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో నాయిని నర్సింహారెడ్డి ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి కాబట్టే.. విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అన్ని రంగాల వారిని ప్రభుత్వం ఆదరిస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు మతిలేని మాటలు మాట్లాడుతున్నారు.. 60 ఏండ్లు పరిపాలించి ఏం సాధించారని నాయిని ప్రశ్నించారు. బీజేపీకి ఉన్నది 5 సీట్లు మాత్రమే. కాంగ్రెస్లో అందరూ ముఖ్యమంత్రులే.. ఈ రెండు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఒక స్థానం కూడా రాదని మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.