లోక్సభలో ఈరోజు రాహుల్ గాంధీ అద్భుత ప్రదర్శన చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఆయనను మెచ్చుకున్నారు. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చలో రాహుల్ చాలా బాగా మాట్లాడారని అన్నారు. ఆయనది గేమ్ ఛేంజింగ్ స్పీచ్ అని ప్రశంసించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం, హామీల గురించి నిలదీయడంతో పాటు అనుకోని ఆలింగనంతో తన ప్రసంగాన్ని ముగించి భాజపాకు నోట మాట రాకుండా చేశారని థరూర్ ట్వీట్ చేశారు. ‘భూకంప్ ఆ గయా’ అనే హ్యాష్ట్యాగ్ను జత చేశారు. గతంలో రాహుల్ గాంధీ తనను లోక్సభలో మాట్లాడనివ్వడం లేదని మాట్లాడితే భూకంపం వస్తుందని చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతలు ‘భూకంప్ ఆనే వాలా హై’ అనే హ్యాష్ట్యాగ్తో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దాన్ని తిప్పి కొడుతూ శశిథరూర్ రాహుల్ ప్రసంగం అనంతరం భూకంపం వచ్చిందని అన్నారు.
మరో కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ కూడా రాహుల్ ప్రసంగాన్ని మెచ్చుకున్నారు. సాధారణ ప్రజలు, రైతులు, వ్యాపారులు, మహిళలకు సంబంధించిన అంశాల గురించి రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రస్తావించారని అన్నారు. మహిళల రక్షణ గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారని, ఎన్డీయే పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వెల్లడించారు. ఇలాంటి ముఖ్యమైన విషయాలపైనా ప్రధాని మౌనంగా ఉన్నారని విమర్శించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించిన అనంతరం మోదీ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ హఠాత్పరిణామంతో మోదీతో సహా సభలోని సభ్యులంతా ఆశ్యర్యపోయి ఆ తర్వాత నవ్వులు చిందించారు. సాయంత్రం ఆరు గంటల వరకు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఆ తర్వాత మోదీ ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రసంగిస్తారు. అనంతరం ఓటింగ్ జరగనుంది.