హైదరాబాద్ : హైదరాబాద్ మెగా సిటీగా అవతరించింది. ఈ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎల్బీనగర్లోని కామినేని జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. హైదరాబాద్ మహానగరంలో 32 నుంచి 35 శాతం మాత్రమే ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు వినియోగించుకుంటున్నారు. ఇక మిగతా 65 శాతం మంది సొంత వాహనాలను ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ మెగా సిటీగా అవతరించింది.
ఈ క్రమంలో రూ. 23 వేల కోట్లతో నగర అభివృద్ధి ప్రణాళిక చేపట్టామని తెలిపారు. నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రూ. 9 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రూ. 100 కోట్లతో ఫుట్పాత్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ బాగుపడితేనే ట్రాఫిక్ సమస్యను అధిగమించే అవకాశం ఉందన్నారు. ప్రజలు బాగుండాలన్నదే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. అమీర్పేట్ - ఎల్బీనగర్ మెట్రోను సెప్టెంబర్ మొదటి వారం వరకు ప్రారంభించుకుంటామని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశను ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు పొడిగించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఎల్బీనగర్ నుంచి నాగోల్కు, శంషాబాద్ ఎయిర్పోర్టుకు వరకు మెట్రోను విస్తరిస్తాం. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుందని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు.