నగరంలో దొంగలు చెలరేగిపోయారు. ఓ వాహనంలో దర్జాగా వచ్చిన దొంగలు శేరిలింగంపల్లి తారానగర్ ప్రాంతంలో 2 ఏటీఎంలలో చొరబడి నగదును దోచుకెళ్లారు. ఏకంగా గంటసేపు అక్కడే గడిపి తమ పని కానిచ్చేశారు. శుక్రవారం వేకువజామున 3.42 గంటల ప్రాంతంలో ఈచోరీ జరిగింది. ఒకే షట్టర్లో ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన మూడు ఎటీఎంలలో రెండింటిని పగులగొట్టి రూ.13 లక్షల సొమ్మును ఎత్తుకెళ్లారు. ఈఏటీఎం కేంద్రానికి నలుగురు ఆగంతకులు వచ్చారు. ఒకరు ముసుగు ధరించి ఉండగా మరో ముగ్గురు మామూలుగా ఉన్నారు. ఏటీఎంలున్న షట్టర్లోకి వెళ్లి ముందు అలారం తీగలను కత్తిరించారు. ఒకరు బయట కాపలా ఉండగా మిగిలిన ముగ్గురు లోపల గ్యాస్కట్టర్ సాయంతో రెండు ఏటీఎంలను బద్దలుకొట్టారు. అందులోని నగదు బయటకు తీశారు. పక్కనే ఉన్న మూడో ఏటీఎంను కదిలించలేదు. దాదాపు గంటపాటు దొంగలు ఈ ప్రక్రియలో నిమగ్నమైనట్లు సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా పోలీసులు నిర్ధారించారు. చందానగర్ ఠాణా పరిధిలో చోరీ జరిగింది. సీఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో దర్యాప్తు ఆరంభించారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.