ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో ఇవాళ ఉదయం నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత రెండు వారాల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఫ్లై ఓవర్కు సపోర్టుగా పెట్టిన ఇనుప రాడ్లు భూమిలోకి కుంగిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. శిథిలాలను తొలగించి.. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ ఫ్లై ఓవర్ పనులు 60 శాతం పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. గత వారం ఆగ్రా - లక్నో ఎక్స్ప్రెస్వే సర్వీస్ రోడ్డులో కారు గుంతలోకి వెళ్లిన విషయం విదితమే. ఈ ప్రమాదం నుంచి నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఏడాది మే నెలలో వారణాసిలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోవడంతో పలువురు మృతి చెందిన విషయం విదితమే.