ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి రైతుబీమా అమలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 15, 2018, 11:21 AM

రాష్ట్రంలోని రైతులందరికీ భరోసా కల్పించేందుకు రైతుబీమా పథకాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం ప్రసంగించారు. రైతు ఏ కారణంతో మరణించినా అతని కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. భారత జీవిత బీమా సంస్థ - ఎల్‌ఐసీ ద్వారా ఈ పథకం అమలవుతుందన్నారు. ప్రతీ ఏటా చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని రైతుల తరపున ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రూ. 5 లక్షల బీమా మొత్తం రైతు మరణించిన పది రోజుల వ్యవధిలోనే ఆయన కుటుంబానికి అందించే విధంగా ఈ పథకాన్ని ప్రభుత్వం రూపొందించిందని సీఎం తెలిపారు. 


ప్రాజెక్టుల నిర్మాణం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర బడ్జెట్‌లో ఏటా రూ. 25 వేల కోట్లను ప్రభుత్వం కేటాయిస్తున్నదని సీఎం గుర్తు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికీ పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నాం. ఈ ఏడాది మరో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు. 


గొల్లకుర్మలకు పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై 2.13 లక్షల మంది రైతులకు బర్రెల పంపిణీ ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం కోసం కావాల్సిన చేప పిల్లలను, రొయ్య పిల్లలను ప్రభుత్వమే సరఫరా చేస్తున్నదని పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com