ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క‌ర్ణాట‌క‌ స‌రిహ‌ద్దు జిల్లా‌లలో ఎడ‌తెరిపిలేని వ‌ర్షా‌లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 15, 2018, 11:26 AM

కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాల ప్రభావం.. సరిహద్దు కర్ణాటక జిల్లాలపై పడింది. ఎడతెరిపిలేని వర్షాలకు దక్షిణ కన్నడ, ఉడుపి, కొడగు, మైసూరు, శివమొగ్గ, చిక్కమగళూరు జిల్లాల ప్రజలు వ‌ర్షా‌లకు ఇబ్బందులు ప‌డుతున్నా‌రు. ప్రధాన పట్టణాల నుంచి మారుమూల అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు 12 గంటల వ్యవధిలోనే ఉడుపి జిల్లా బైరాంపల్లిలో 179.5 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. పశ్చిమ కనుమల్లోని కొండదారుల్లో మట్టిదిబ్బలు విరిగి ప‌డుతున్నా‌యి. వేలాది ఎకరాల్లో పంట పొలాల్లో నీరు చేరింది. ఈదురుగాలులకు పోక, అరటి, కాఫీ తోటలకు నష్టం వాటిల్లింది. ఆలయ పర్యటనల్లో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని దేవేగౌడ, కుటుంబసభ్యులకూ ఇబ్బందులు ఎదురయ్యాయి. ధర్మస్థల నుంచి కుక్కె సుబ్రహ్మణ్య, అక్కడినుంచి మంగళూరుకు వెళ్లే మార్గాల్లో కొండచరియలు విరిగిపడడం, వంతెనలపై నీటి ప్రవాహం కారణంగా మార్గాలను మార్చుతూ వారు పర్యటనను కొనసాగించారు.


 ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో పూర్తిగా, చిక్కమగళూరు, కొడగు, శివమొగ్గ జిల్లాల్లో పలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చిక్కమగళూరు, హొరనాడు, కళస మార్గాల్లోని వంతెనలు నీట మునిగాయి. రాకపోకలు నిలిచిపోయాయి. తుంగ, భద్ర నదులు పొంగుతుండడంతో హెబ్బాళ, మహల్‌గూరు వంతెనలు నీట మునిగాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సముద్రతీరంలో హెచ్చరికలను జారీ చేశారు. కొడగు జిల్లా త్రివేణిసంగమం ఉన్న భాగమండల పూర్తిగా జలమయమైంది. మైసూరు శివార్లలో సుత్తూరు వంతెనను తాకుతూ కావేరి ప్రవహిస్తోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com