హైదరాబాద్ : సచివాలయంలో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై అధికారులను అడిగితెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరద పరిస్థితి, ఇతర జిల్లాల్లో వర్షాల ప్రభావంపై అడిగితెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్రెడ్డిలతో మాట్లాడారు. స్పెషల్ ఆఫీసర్లు ఆయా జిల్లాల్లో వర్షం, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ స్థానిక అధికారుల సమన్వయంతో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందన అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ జిల్లాల్లో నియోజకవర్గాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండాలి.
అధికారులు, పోలీసుల సహాకారంతో అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలి. సెక్రటరియేట్లో సీనియర్ అధికారి నాయకత్వంలో 24 గంటల పాటు వర్షాల పరిస్థితిని పర్యవేక్షించాలి. ప్రజలు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. వాగులు, వంకలు పొంగి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ముఖ్య ప్రజాప్రతినిధులు స్థానికంగా అందుబాటులో ఉండాల్సి ఉన్నందున శుక్రవారం జరిగే పార్టీ సమావేశం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వర్షాలు తగ్గిన తరువాత సమావేశం ఉంటుంది. త్వరలోనే తేదిని ఖరారు చేస్తామని వెల్లడించారు.