న్యూఢిల్లీ: కన్నుమూసిన మాజీ ప్రధాని వాజ్పేయి పార్ధీవదేహానికి ఇవాళ అనేక మంది ప్రముఖులు నివాళి అర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. వాజ్పేయి పార్ధీవ దేహం వద్ద పుష్పాంజలి ఘటించారు. నేషనల్ సెక్యూర్టీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా ఇవాళ నివాళి అర్పించారు. త్రివిధదళాలకు చెందిన నేవీ చీఫ్ అడ్మిరల్ సునిల్ లంబా, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్లు వాజ్పేయి భౌతికకాయానికి నివాళ్లు అర్పించారు. సాయంత్రం 4 గంటలకు అంతిమ యాత్ర జరుగుతుంది. అంతిమయాత్ర కోసం ఢిల్లీ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. నివాళి అర్పించేందుకు వచ్చే అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీలు జావెద్ అక్తర్, షబానా ఆజ్మీలు కూడా వాజ్పేయి పార్ధీవదేహానికి నివాళి అర్పించారు. అన్ని రాజకీయ పార్టీలు ఓ నాయకుడిని గౌరవించడం చాలా అరుదైన విషయమని జావెద్ అక్తర్ అన్నారు. భిన్న భావజాలాలు ఉన్న వ్యక్తులు కూడా వాజ్పేయి ఆదరిస్తారని జావెద్ అక్తర్ తెలిపారు.