ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళకు కేసీఆర్ రూ. 25 కోట్ల సాయం..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 18, 2018, 09:43 AM

ఎడతెగని వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బూరీ విరాళం ప్రకటించారు. జల ప్రళయంతో ఇబ్బంది పడుతున్న కేరళ రాష్ట్రానికి రూ. 25 కోట్లను తక్షణ సహాయంగా ప్రకటించారు. వెంటనే ఈ డబ్బులను కేరళ రాష్ట్రానికి అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిని ఆదేశించారు. దీంతో పాటు భారీ వరదల కారణంగా జల కాలుష్యం జరిగిన నేపథ్యంలో నీటిని శుద్ధి చేయడానికి 10 రివర్స్ ఓస్మోసిస్ ప్లాంట్లను కేరళకు పంపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వీటి విలువ రూ. 2.5 కోట్లు. 


కేరళలో జల ప్రళయం కారణంగా ఇప్పటివరకూ 324 మంది మరణించిన విషయం తెలిసిందే. కేరళలో సంభవించిన ప్రకృతి వైపరిత్యం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగడం పట్ల కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్తు నుంచి కేరళ రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ తరఫున అవసరమైన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. 


కేరళ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నందున వారిని ఆదుకోవాల్సిన కర్తవ్యం తోటి రాష్ట్రంగా మనకుందని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగ ప్రముఖులు, వాణిజ్యవేత్తలు, ఇతర రంగాల వారు తమకు తోచినంత సాయం అందించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందిస్తే వాటిని తక్షణం కేరళ రాష్ట్రానికి పంపేవిధంగా ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. 


గత వందేళ్లలో ఎప్పుడూ ఇలాంటి వరద బీభత్సం చూడలేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. నిరాశ్రాయులకు పునరావాసం కల్పించడానికి ఇతోధికంగా సాయం చేయాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. కేరళ పునర్‌నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. 


భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటంతో కేరళ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాష్ట్రంలోని 14 జిల్లాలకు గాను అన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరద బీభత్సం కారణంగా దాదాపు రెండు లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 


 


కేరళలో 80 డ్యామ్‌ల గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 3, 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో కేరళ వాసులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ప్రధాని మోదీ వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం ఉదయం ఏరియల్ సర్వే చేయనున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com