సర్వీసు ఉన్నా వీఆర్ఎస్ తీసుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ... రాజీకాయాల్లోకి రావడం ఖాయమనే ప్రచారం వినిపించింది. ఆయన బీజేపీ చేరతారంటే... కాదు, జనసేనలో చేరాయం పక్కా అని అంచనాలు వేశారు. కానీ, ఏ పొలిటికల్ పార్టీతో సంబంధంలేకుండా ఆయన రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ... రైతులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఇదంతా పార్టీ పెట్టడం కోసమే చేస్తున్నారనే అభిప్రాయాలు కొందరు వెలిబుచ్చారు. కానీ, తనకు పార్టీ పెట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు లక్ష్మీనారాయణ... ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లామల్లిలో పర్యటించిన ఆయన... జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ తర్వాత ఎన్ఆర్ఐలు గ్రామంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే తాను ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో పర్యటించానని, మిగతా నాలుగు జిల్లాల్లోనూ పర్యటించిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అయితే రైతుల సంక్షేమాన్ని కాంక్షించే పార్టీతోనే తన రాజకీయ పయనం సాగుతుందని స్పష్టం చేశారు.